
కథల పోటీలు
ముల్కనూరు సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఏటా కథల వ్రతం జరుగుతోంది. ఈ కథల వ్రతంలో.. ఓ రచయితది చెలియలికట్ట దాటని ఆవేశం.. మరో కథకుడిది కట్టలు తెంచుకున్న ఆవేదన.. ఆలోచనలకు రెక్కలు తొడిగింది ఒకరైతే .. ఆప్యాయతలకు పెద్దపీట వేసింది మరొకరు! ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహిస్తున్న కథల పోటీలలో కథలు వరాల జల్లుగా వర్షించాయి. 2019 నుంచి 2025 వరకూ వెల్లువలా వచ్చిన వందలాది కథలను విశ్లేషించి.. అనేక దశల్లో వడబోసి.. అత్యుత్తమ కథలను పాఠకుల ముందు ఉంచి, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కథకులను మరోసారి కొత్త తరానికి పరిచయం చేయనైనది.

సృజనాత్మక పోటీలు
శ్రీ కోడూరి రాజయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల వికాసమే లక్ష్యంగా, ఏడవ తరగతి విద్యార్థుల నుండి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల వరకు ఏటా జిల్లా స్థాయిలో సృజనాత్మక పోటీలు జరుగుతాయి. ముఖ్యంగా వక్తృత్వ (Elocution), వ్యాసరచన (Essay Writing), చిత్రలేఖన (Drawing), క్విజ్ (Quiz), పాటలు (Songs) విభాగాలలో ఈ పోటీలు జరుగుతాయి. అలాగే మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ.. వారినీ గ్రంథాలయ అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇలా అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో గ్రంథాలయం ఒక నిత్యచైతన్య సాంస్కృతిక కేంద్రంగా పరిఢవిల్లుతోంది
